టీడీపీ 44 వార్డు…
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా
నిర్వహిస్తున్న మహానాడు సంబరాలు క్షేత్రస్థాయిలో అంబరాన్నంటుతున్నాయి. పార్టీ అధిష్టానం, నారా లోకేష్ పిలుపు మేరకు ప్రతి వార్డులోనూ ఈ వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలోని అక్కయ్యపాలెం 44వ వార్డులో టిడిపి వార్డ్ ప్రెసిడెంట్ గారపాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలన్న ఉద్దేశంతో అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు.. కార్యకర్తలు, ప్రజలు ఎక్కడికక్కడ తమ వార్డుల పరిధిలోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారన్నారు. ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా చంద్రబాబు, లోకేష్ బాబుల ప్రసంగాలను ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా వీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వార్డుల స్థాయిలోనే మహానాడు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, ముఖ్యంగా మహిళల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.