మయోపియా కంటి వ్యాధి అవగాహన ర్యాలీ
విశాఖపట్నం 16 నవంబర్ 2025 : పిల్లల నేత్ర సంరక్షణా వారోత్సవాలను స్థానిక LV ప్రసాద్ నేత్ర వైద్యశాల, GMR వరలక్ష్మి క్యాంపస్, విశాఖపట్నం వద్ద నవంబర్ 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించారు. భారతదేశంలో ముఖ్యంగా పిల్లలలో మయోపియా వేగంగా పెరగడం పైన వారు ఆందోళన వ్యక్తం చేసారు. అందుకనే ఈ వారోత్సవాలను “ మయోపియా అవగాహన “ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వారోత్సవాలు సందర్భంగా GMR వరలక్ష్మి క్యాంపస్ నందలి LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారం రోజులు పాటు నిర్వహించిన ఈ వారోత్సవాలు ఈరోజు స్థానిక బీచ్ రోడ్ లోని కాళీమాత గుడి దగ్గర నుండి YMCA వరకు సాగిన మయోపియా అవగాహన ర్యాలీతో ముగిసాయి. ఈ అవగాహన ర్యాలీలో సుమారు 300 మంది పిల్లలు మరియు తల్లితండ్రులు పాల్గొన్నారు. మయోపియా పైన అవగాహన కల్పించే ప్లకార్డులను చేత పట్టుకుని ఈ నడక ర్యాలీ సాగింది. మయోపియా వ్యాధి లక్షణాలు, వ్యాధికి కారణాలు, ముందుగా గుర్తించుట మరియు చికిత్సా విధానాలు గురించి ఈ ర్యాలీ సందర్భంగా అవగాహన కలిగించారు. ముఖ్యంగా పిల్లలను ఆరు బయట సూర్యరశ్మి సోకే విధంగా ఆడుకోనివ్వాలని, సూర్యరశ్మి తగిలితే మయోపియా వ్యాధి రాకుండా పిల్లలను కాపాడవచ్చునని LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్య బృందం సూచించారు.
ఈ మయోపియ అవగాహన ర్యాలీ లో పాల్గొన్న LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కన్సల్టెంట్ పిడియాట్రిక్ ఆప్తాల్మలజిస్ట్ డాక్టర్ అదితి పారిఖ్ సమీర్ బాయ్ మాట్లాడుతూ పిల్లలను తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలిస్తుండాలని పిల్లలు అక్షారాలు మరియు వస్తువులను చూడటంలో ఇబ్బంది పడుతుంటే, బ్లాక్ బోర్డుపై అక్షరాలూ స్పష్టంగా కనిపించక పొతే వారికి వెంటనే నేత్ర పరీక్షలు చేయించాలని సూచించారు. మయోపియా వ్యాధి లక్షణాలు ముందస్తుగా గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స అందించటం ద్వారా సత్పలితాలు పొందవచ్చునని ఈ సందర్భంగా LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ క్యాంపస్ హెడ్ డాక్టర్ వీరేంద్ర సచ్ దేవా అన్నారు.