*పత్రికా ప్రకటన*
*ముందస్తు జాగ్రత్తగా నిలిపివేసిన డ్రోన్ పరీక్షా విమానం*
*ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా సురక్షితంగా ల్యాండింగ్ చేసిన పైలట్*
*పాడేరు – ముంచింగిపుట్టు మార్గంలో సాంకేతిక వ్యత్యాసం గుర్తింపు*
పాడేరు, మార్చి 27 : అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్ సేవల పనితీరును పరిశీలించే క్రమంలో గురువారం సాయంత్రం ఒక పరీక్షా విమానాన్ని అధికారులు ముందుజాగ్రత్తగా ల్యాండ్ చేశారు. పాడేరు నుండి ముంచింగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం వరకు డ్రోన్ పనితీరును ధృవీకరించే లక్ష్యంతో ఈ ప్రయోగాత్మక ప్రయాణాన్ని నిర్వహించారు. అయితే, గాలి వేగంలో అసాధారణ మార్పులు గమనించిన సాంకేతిక బృందం, ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా విమానాన్ని కిందకు దించారు.
గురువారం మధ్యాహ్నం 3:40 గంటల సమయంలో పాడేరు నుండి బయలుదేరిన డ్రోన్ (UAV), భూమికి సుమారు 400 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు గాలి వేగాన్ని కొలిచే పరికరాల్లో (Airspeed Readings) స్వల్ప వ్యత్యాసం కనిపించింది. డ్రోన్ నిబంధనల ప్రకారం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆపరేషన్స్ బృందం వెంటనే అప్రమత్తమైంది. ఆటోమేటెడ్ మార్గాన్ని నిలిపివేసి, పైలట్ తన నియంత్రణలోకి తీసుకున్నారు.
పెదబాయలు సమీపంలోని గంపరాయి గ్రామం, బోయితేలి వద్ద ఎటువంటి జనసమ్మర్థం లేని ఖాళీ ప్రదేశాన్ని గుర్తించిన బృందం, డ్రోన్ను అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఈ ప్రక్రియలో ప్రజలకు కానీ, ప్రైవేటు ఆస్తులకు కానీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. డ్రోన్ పరికరం కూడా ఎటువంటి దెబ్బతినకుండా క్షేమంగా ఉందని సాంకేతిక సిబ్బంది వెల్లడించారు.
డ్రోన్ ల్యాండ్ అయిన వెంటనే స్థానిక గ్రామస్థులకు పరీక్షా ప్రయాణం యొక్క ఉద్దేశాన్ని మరియు సాంకేతిక కారణాల వల్ల నిలిపివేయాల్సి వచ్చిన విషయాన్ని బృందం వివరించింది. ప్రజల్లో ఎటువంటి ఆందోళన కలగకుండా పూర్తి పారదర్శకతను పాటించారు. అనంతరం డ్రోన్ను విడదీసి సురక్షితంగా బేస్ క్యాంపునకు తరలించారు.
గాలి వేగంలో వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించడానికి ఫ్లైట్ లాగ్లను పరిశీలిస్తున్నామని, సెన్సార్ల పునఃపరిశీలన చేపడుతున్నామని రెడ్వింగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జిల్లా అధికారులకు ఈ ఘటనపై పూర్తి నివేదికను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.