శ్రీ సత్య సాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా
యూత్ వింగ్
ప్రెస్ రీలీజ్ – అక్టోబర్ 19, 2025
*మన జీవితంలో మంచి పనులు చేయడానికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి” – డా. శంక బ్రత బాఘ్చి, IPS, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం*
విశాఖపట్నం, అక్టోబర్ 19:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల యూత్ వింగ్ ఆధ్వర్యంలో “యువ వికాస్” అనే ఆత్మీయ, ప్రేరణాత్మక సదస్సు ఈ రోజు శ్రీ సత్య సాయి ప్రేమసదన్ మందిరంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంక బ్రత బాఘ్చి, IPS, శ్రీ సత్య సాయి యువతను ఉద్దేశించి విలువైన సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆదర్శాలను అనుసరించాలని సూచించారు.
తన జీవితమంతా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు మానవజాతి సేవలో గడిపారని, సేవా మార్గం ద్వారానే కోట్లాది మందికి ప్రేమ, త్యాగం, దయా తత్త్వాలను బోధించారని ఆయన అన్నారు. దీనుల కష్టాలు తీర్చడం కోసం మానవ రూపంలో అవతరించిన దైవ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అని కోట్లాది మంది కొలుస్తారని ఆయన పేర్కొన్నారు.
“మంచి పనులు ఎప్పుడూ మనల్ని రక్షిస్తాయి” అని చెబుతూ, ప్రకృతిలోని ప్రతి వస్తువు — నదులు, వృక్షాలు వంటి వాటిలా — ఇతరుల కోసం సహాయం చేస్తాయనీ, అలాగే జ్ఞానం, వివేకం కలిగిన మనిషి కూడా సమాజానికి మరింతగా ఉపయోగపడేలా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీ సత్య సాయి సేవా సంస్థల మందిరానికి రావడం, శ్రీ సత్య సాయి యువతతో సంభాషిచడం మాట్లాడడం తనకు ఎంతో సంతోషంగా, అదృష్టంగా అనిపిస్తోందని డా. బాఘ్చి అభిప్రాయపడ్డారు.
డా. బాఘ్చి గారి ప్రేరణాత్మక సందేశం పట్ల శ్రీ సత్య సాయి యువత హర్షధ్వానాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
బిజీ షెడ్యూల్లో కూడా సమయాన్ని వెచ్చించి యువతకు విలువైన సందేశం అందించినందుకు శ్రీ జి. సాయి ప్రశాంత్, శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా యూత్ కోఆర్డినేటర్, పోలీస్ కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా. శంక బ్రత బాఘ్చి గారిని శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు మరియు ఇతర పదాధికారులు సన్మానించారు. అనంతరం డా. బాఘ్చి గారు, శ్రీ నాయుడు గారితో కలిసి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి- విశాఖ సిటీ కన్వీనర్ శ్రీ బి. సాయి కుమార్, రాష్ట్ర జాయింట్ సేవా సమన్వయకర్త, శ్రీ డి. రాఘవరావు,జిల్లా సేవా సమన్వయకర్త, శ్రీ ఆర్.ఏ. నాయుడు, జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి సోమేశ్వరి, తో పాటు అనేక మంది శ్రీ సత్య సాయి యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.