ప్రజలంతా ఓటు వేయాలి
– టీడీపీ సీనియర్ నేత కంచర్ల అచ్యుత రావు
విశాఖ పట్నం: టీడీపీ సీనియర్ నేత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత కంచర్ల అచ్యుత రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన తన కుమారుడు, ఉపేంద్ర గాడి అడ్డా సినిమా హీరో కంచర్ల ఉపేంద్ర తో కలిసి తూర్పు నియోజక వర్గం పరిధి ఎం వీ పి కాలనీ సెక్టార్ – 10లో గల ఆళ్వార్ దాసు పబ్లిక్ స్కూల్లో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ముం దుకొచ్చి ఓట్లు వేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన వారు తొలిసారిగా వేసిన ఓటు మరపు రాని మధురానుభూతి అని అభివర్ణించారు. ప్రజా స్వామ్యం లో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది అని ఆయన గుర్తు చేశారు. ప్రజా స్వామ్యం లో నాయకులు తలరాత మార్చే ఆయుధం కూడా ఓటు అని పేర్కొన్నారు. ఒక్క ఓటు వేయకుంటే ఏమవుతుందిలే ఆన్న నిర్లిప్త ధోరణి పనికి రాదని హితవు పలికారు. మేధావులు కూడా పోలింగ్ కి ముందుకు రావాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. 2019 తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని ఆయన కోరారు.