ఒరిస్సా ఐటి కంపెనీకి భూ కేటాయింపులు రద్దు చేయాలి రూరల్‌ తహశీల్ధార్‌ ఆఫీస్‌ ఎదుట సిపిఎం ధర్నా

by vvwnews.com

ఒరిస్సా ఐటి కంపెనీకి భూ కేటాయింపులు రద్దుచేయాలి*
*రూరల్‌ తహశీల్ధార్‌ ఆఫీస్‌ ఎదుట సిపిఎం ధర్నా*
విశాఖలో అత్యంత ఖరీదైన భూములను పేరు ఊరు లేని ఒరిస్సా క్లస్టర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రాష్ట్ర టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం హిల్‌ నెంబర్‌ 3లో టిసిఎస్‌కు కేటాయించిన దగ్గరే 3.6 ఎకరాల భూమిని మరియు కాపులుప్పాడలో 56ఎకరాలు భూమిని కేటాయించింది. ఇది ఒక బోగస్‌ కంపెనీ. తక్షణమే ఈ కంపెనీకి కేటాయించిన భూములను వెనుక్కు తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ డిమాండ్‌ చేసారు.
ఒరిస్సా సాప్ట్‌వేర్‌ కంపెనీకి భూ కేటాయింపును నిరశిస్తూ మంగళవారం ఉదయం విశాఖ రూరల్‌ తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కమిటీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ గత రెండు నెలలు క్రితం రిజిస్ట్రేషర్‌ అయిన బోగస్‌ కంపెనీ విలువైన ప్రభుత్వ భూములను ఉద్యోగాల పేరిట కేటాయించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఉర్సా కంపెనీ యజమాని ఎవరో తెలియదు. సాఫ్ట్‌వేర్‌ మార్కెట్లో దానికున్న గుర్తింపు, ఇప్పటివరకు సాధించిన విజయాలు, ఎంత మందికి ఉపాధి కల్పించింది వంటి అంశాలను పరిశీలన చేయకుండా భూములు కేటాయించిందంటే రాష్ట్ర కూటమి ప్రభుత్వ పెద్దలకు బినామీ కంపెనీ అని అనుమానించాల్సి వస్తుందన్నారు. నేడు లక్షలాది మంది పేదలు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ భూములను ప్రైవేట్‌వారికి కట్టబెట్టడం సరైంది కాదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన పేరుతో ప్రైవేట్‌ వారికి ప్రభుత్వ భూములు ఇవ్వడంకంటే ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించినట్లు అయితే లక్షలాది మందికి శాశ్వత ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఐటి సంస్థలతో చేసుకున్న ఎంఓయుల ప్రకారం ఎంతమందికి ఉపాధి కల్పించాయో సమీక్ష చేసినట్లైతే ఈ కంపెనీల భాగోతం తేటతెల్లమౌతుంది. అతితక్కువ వేతనాలు చెల్లిస్తూ రోజుకు 12 గంటలకు పైగా పనిచేయించుకుంటున్నాయని గుర్తుచేసారు. తక్షణమే ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకే వినియోగించే విధంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
అనంతరం డిప్యుటీ తహశీల్ధార్‌కు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు డి.అప్పలరాజు, వి.నరేంద్రకుమార్‌, జోన్‌ కమిటీ సభ్యులు పి.శంకరరావు, కె.కుమారి, ఐ.సి.నాయుడు, పి.రాజ్‌కుమార్‌, డి.కొండమ్మ, డి.నాగరాజు, ఎం.లక్ష్మి, ఎన్‌.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
వి.కృష్ణారావు
కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles