మన సముద్రం మన వాతావరణం కోసం మనమే ప్రయత్నించాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం

by vvwnews.com

మన సముద్రం మన వాతావరణం కోసం మనం కృషి చెయ్యాలి
– ఐ. కృష్ణ కుమారి. ఫెలోషిప్ ప్రతినిధి, ఏక్షన్ ఎయిడ్ సంస్థ
మన సముద్రం మన వాతావరణం కోసం మనం కృషి చెయ్యాలి అని ఏక్షన్ ఎయిడ్ సంస్థ ఫెలోషిప్ ప్రతినిధి ఐ. కృష్ణ కుమారి కోరారు. శనివారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ చేరువలో ఉన్న జాలారిపేటలో ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం, ప్రపంచ సముద్రాల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మత్స్యకారుల సాధికారత, శీతోష్ణస్థితి న్యాయం బలపరచడం అనె అంశం మీద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 8వ తేదీ ఒక్కటే కాదు ఏడాది పొడవునా ప్రపంచ వ్యాప్తంగా మహా సముద్రాలను కాపాడుకోవాల్సిన రోజులే అని ప్రతి ఒక్కరూ గుర్తించి అమలు చేయాలని కోరారు. ఒక మహాసముద్రం,
ఒకే వాతావరణం, ఒక్కటే మన భవిష్యత్తు అనె ఆలోచనతో సమిష్టిగా కృషి చెయ్యాలన్నారు. సమస్త జనావళినీ సముద్రాల పరిరక్షణకు చైతన్య వంతులు చేయాలని కోరారు. మహా సముద్రాలు భూగ్రహం మీద 70% పైగా విస్తరించి ఉన్నాయని, ఇది మన జీవనాధారం, మానవాళి యొక్క జీవనోపాధికి, భూమిపై ఉన్న ఇతర జీవరాశికి ఇవి చాలా ఉపకరిస్తున్నాయని వివరించారు.
వనమాలి గార్డనర్స్ క్లబ్ అడ్మిన్ మళ్ళ సరిత మాట్లాడుతూ భూగ్రహం మీద మనం వినియోగించే ఆక్సిజన్‌లో కనీసం 40 % నుండి 80% వరకూ సముద్రం ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇది భూమి యొక్క జీవవైవిధ్యానికి నిలయంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి ప్రోటీన్ ఆహారం ప్రధానంగా సముద్రాల నుండి లభిస్తుందన్నారు. 2030 నాటికి సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా 40 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా, మన ఆర్థిక వ్యవస్థకు సముద్రాలే కీలకం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, మత్స్యకారులు ప్రతినిధి తెడ్డు జ్యోతి తదితరులు మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles