కంచి విశ్వ విద్యాలయం ప్రవేశాలకు అపూర్వ ఆదరణ
శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం ఉప కులపతి గుళ్ళపల్లి శ్రీనివాస్ పిలుపు మేరకు ఆదివారం విశాఖ నగరంలోని శంకర మఠం లో జరిగిన విద్యార్ధుల ప్రవేశాల అవగాహన కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. సుమారు 300మంది విద్యార్ధినీ విద్యార్ధులు వివిధ తరగతులలోను, ఇంజనీరింగ్ విద్య లోనూ ప్రవేశాలు పొందారు. విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్వీనర్ యామిజాల నరసింహమూర్తి స్వాగతం తో ఉదయం కార్యక్రమం ప్రారంభమైంది. ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై కంచి విశ్వ విద్యాలయం ప్రాశస్త్యాన్ని వివరించారు. భారత సంప్రదాయ విధానం ద్వారా ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్య బోధించే ఏకైక విశ్వ విద్యాలయంగా కంచి విశ్వ మహా విద్యాలయం పేరుగాంచిందని ఆయన కొనియాడారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన లేజర్ ప్రదర్శన ద్వారా విశ్వ మహా విద్యాలయం యొక్క ప్రాంగణం, సౌకర్యాలు, బోధనా విధానాలు, క్రీడా ప్రాంగణం వగైరాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వివరించారు.
సాయంత్రం జరిగిన సభకు శంకర మఠం అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు అధ్యక్షత వహించారు. కులమతాలకు అతీతంగా విద్యార్ధులు అందరికీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారు విశ్వ విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మఠం కార్యదర్శి అచ్యుత రామయ్య, కోశాధికారి నరసింహమూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించారు