*తమిళనాడు గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధం : సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ*
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్కు న్యాయవాదుల తరఫున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వాసుపల్లి చెన్నారావు మాట్లాడుతూ.. మెజార్టీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు.
తమిళనాడులో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ విజయ్ దళపతికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన తొలి ప్రసంగంలో చెప్పడం ఆకట్టుకుందని పేర్కొన్నారు. న్యాయవాదులకు గౌరవప్రదమైన స్థానం కల్పించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పాకా సత్యనారాయణ, వాసుపల్లి చెన్నారావు, వై దేవుడు, జి కుమార్, వై రవిబాబు తదితరులు పాల్గొన్నారు.