రామానుజ సిద్ధాంతం విశ్వవ్యాప్తం కావాలి
-శ్రీమన్నారాయణ చిన జీయర్ అభిభాషణ
సింహాచలం,మే 1: దేశంలో వేదాలు అంటే భక్తి గౌరవం ప్రజల్లో పెరిగిందని, అయితే ఆ వేదాలని నిత్యం స్మరిస్తూ దేవతార్చన చేస్తున్న వారు నిరాదరణకు గురవుతున్నారని పరమహంస పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి సహస్ర ఘటాభిషేకంలో ఆయన స్వయంగా పాల్గొని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి మూలమూర్తి కి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి దేవాలయంలో ఆయన అనుగ్రహం భాషణం చేస్తూ తాను ఒక్కడూ నరకానికి పోయినా తన ద్వారా వందమంది పుణ్యలోకాలకు పోతారు అంటే అది తనకు మహద్భాగ్యం అని రామానుజాచార్యులు అన్నారన్నారు. లోక హితం కోసం పాటుపడిన రామానుజ సిద్ధాంతం విశ్వవ్యాప్తం కావాలని, అందుకు అందరూ కృషి చేయాలని, ముఖ్యంగా ప్రతి దేవాలయంలో అర్చక స్వాములు రామానుజ సిద్ధాంతాన్ని రామానుజ తత్వాన్ని భక్తులకు విస్తృతంగా తెలియజేయాలని ఉద్బోధించారు. రామానుజాచార్య 1008 జన్మ నక్షత్రం మే ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వేద ఉద్ధరణకు చేయూత ఇస్తూ ప్రతి కుటుంబం నుంచి ఒకరిని వేదవిద్య అభ్యసించేందుకు కృషి చేస్తానని ప్రతిన పూనాలని ఆకాంక్షించారు.
ఆయన వెంట అహోబల జీయర్ స్వామి, సింహాచలం దేవస్థానం స్థానాచార్యులు గోపాలాచార్య స్వామి ఆలయం అర్చక స్వాములు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమంది శ్రీ వైష్ణవ స్వాములు పాల్గొన్నారు.