*దుర్గాలమ్మ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు*
*రాట వేసి ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
పూర్ణ మార్కెట్లో కొలువుదీరిన శ్రీ దుర్గాలమ్మ శివరాత్రి పండుగ రాట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై రాట వేసి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్ణ మార్కెట్లో అమ్మవారి శివరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఘనంగా జరుగుతాయన్నారు. ఈ ఏడాది కూడా ఆలయ కార్యనిర్వాహణాధికారి సమక్షంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు చేశారన్నారు. శివరాత్రి మహా పర్వదినాన రుద్రాభిషేకాలు అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇక్కడి అమ్మవారికి ఎంతో ప్రత్యేకత ఉందని, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఈ ఆలయం విరాజిల్లుతుందని చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అతి పురాతనమైన ఆలయాలు ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు వైసిపి అధ్యక్షులు అలుపున కనక రెడ్డి, ఆది విష్ణు రెడ్డి, వాసుపల్లి సుబ్రహ్మణ్యం, మల్లా వెంకట విజయ్, దక్షిణ వైసీపీ నాయకులు, ఆలయ సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు.