*విశాఖలో వైభవంగా పుట్టబంగారమ్మ ఆలయ వేడుకలు.. 5 వేల మందికి అన్నదానం*
విశాఖ అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డులో పుట్టబంగారమ్మ ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సరస ప్రసాద్, ఇతర సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఐదు వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సరస ప్రసాద్ మాట్లాడుతూ.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పుట్టబంగారమ్మ గుడి ఉత్సవాలను ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుతున్నామని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో అమ్మవారి పండగ మరింత ఘనంగా జరగనుందని చెప్పారు. సుమారు 5 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భక్తులందరూ స్వామి, అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 44 వార్డ్ టీడీపీ అధ్యక్షులు సతీష్, గోపి, అప్పారావు, సంజీవ్ నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.