విశాఖ సహకార బ్యాంక్ వ్యాపార లక్ష్యం రూ.8 వేల కోట్లు
-వీసీబి చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు
విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో వ్యాపార లక్ష్యాన్ని రూ.8 వేలు కోట్లుగా నిర్ణయించామని బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. ద్వారకానగర్ ఐదో లైనులో గల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రూ. 7,350 కోట్ల మైలురాయిని ఆధిగమించి తాజా లక్ష్యం తో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. 2023-24 నాటికి 1,04,865 మంది సభ్యులు, రూ. 352.61 కోట్లు షేరుధనంతో భారతదేశంలోనే అతి పెద్ద సహకార అర్బన్ బ్యాంకులలో ఒకటిగా స్థానం సంపాదించుకుందన్నారు. తమ బ్యాంక్ 1916 ప్రారంభించి గత 109 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. దేశంలోని నాన్ షెడ్యూల్డ్ సహకార బ్యాంక్ లలో అతి పెద్ద బ్యాంక్ గా విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్, సహకార సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోందని పేర్కొన్నారు. దేశంలో 1502 పట్టణ సహకార బ్యాంకులు వున్నాయి అని గుర్తు చేశారు. బ్యాంక్ సభ్యులకు రూ.లక్ష వరకు ఉచిత జీవిత బీమా వుందన్నారు. రుణాలు సక్రమంగా చెల్లించిన రుణ గ్రహీతలకు 4 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరం లో 2596 మందికి రూ.5.51 కోట్ల మేరకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు.108 వ వార్షిక మహా జన సభ నిర్ణయం మేరకు రూ. 33.56 కోట్లను సభ్యులకు వారి షేరు ధనంపై డివిడెండ్ గా బ్యాంకు చెల్లించిందన్నారు.
ఈ ఏడాది క్రొత్తగా ఐదు బ్రాంచిలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈనెల 20 న షీలానగర్ లో 51 వ బ్రాంచి ఏర్పాటు చేశామని తెలిపారు.చిత్తూరు, బాపట్ల, నరసరావుపేట, తాడేపల్లిగూడెం లలో మరో 4 బ్రాంచిలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకుకు 14 చోట్ల సొంతభవనాలను సమకూర్చుకుందన్నారు. మరో మూడు బ్రాంచిలైన గోపాలపట్నం, గాజువాక సొంత భవన నిర్మాణానికి స్థలాలను కొనుగోలు చేయగా,చోడవరం బ్రాంచి కోసం భవనాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి షెడ్యూల్డ్ హోదా రాగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంటి నిర్మాణం, రిపేర్లు, వాహన కొనుగోలు, వివాహాలు, చదువుకు,చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార నిమిత్తం రుణాలు ఇస్తున్నామన్నారు. డైలీ డిపాజిట్ పథకం కూడా అమలులో వుందన్నారు. గత ఏడాది కాలంలో కోటికి పైగా డిజిటల్ కార్యకలాపాలు ద్వారా రూ.5714 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. మొత్తం 50 బ్రాంచిలలో మహాజన సభలు జరిగాయని రాఘవేంద్రరావు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.87.79 కోట్ల లాభం సాధించినట్లు తెలిపారు. డిపాజిట్లు రూ.4148 కోట్లు, రూ.3199 కోట్లు మేరకు రుణాలు ఇచ్చామని తెలిపారు . 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.24.75 కోట్లు ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లించిన అనంతరం బ్యాంకు రూ.87.79 కోట్లు నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు.
మీడియా సమావేశంలో డైరెక్టర్లు మానం ఆంజనేయులు, జే.వీ.సత్యనారాయణ మూర్తి, స్టాలిన్, ఉప్పల పాటి పార్వతి దేవి, CA వీరఘంట చంద్ర శేఖర్, కామ రాజు, జనార్ధన రావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి , రమణా రావు, కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రావు, సీ.ఈ.ఓ పి. వి. నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు..