జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధికి బాబు స్టిక్కరా?
— మేము తెచ్చిన కంపెనీలకు మీ బ్రాండ్ ఎందుకు బాబు?
— బ్రాండ్ పిచ్చి మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి
— శ్రీ సిటీలో చంద్రబాబు హడావిడిపై మాజీ మంత్రి అమర్నాథ్ ఆక్షేపణ
విశాఖపట్నం, ఆగస్టు 19: మార్కెటింగ్లో మంచి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడపడితే అక్కడ తన మార్కెటింగ్ స్కిల్స్ ని వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారని, శ్రీ సిటీలో సోమవారం జరిగిన కార్యక్రమాలను చూస్తే బ్రాండ్ ఇమేజ్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న తపన, ఆయన పెర్ఫార్మన్స్ అర్థమవుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏగ్దేవా చేశారు. సోమవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో సోమవారం పలు పరిశ్రమలను ప్రారంభించి అదంతా తనఖ్యాతిగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 16 పరిశ్రమలను ప్రారంభించామని చంద్రబాబు ఏ విధంగా చెప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీసిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు భూములను కేటాయించడమే కాకుండా, మౌలిక సదుపాయాలు కల్పించామని, విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు ఆయా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిందని అమర్నాథ్ వెల్లడించారు. చంద్రబాబు శ్రీసిటీలో ఈరోజు ప్రారంభించిన ఏ ఒక్క పరిశ్రమ కూడా ఆయన హయాంలో వచ్చింది కాదు.. అని అమర్నాథ్ స్పష్టం చేశారు. పెట్టుబడులు మేం తెస్తే దానికి చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ వేసుకుంటున్నారని, పరిశ్రమలను మేము ఏర్పాటు చేస్తే దానికి తన స్టిక్కర్ అంటించుకుంటున్నాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్టు, బందరు పోర్టు, రామాయపట్నం పోర్టు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ఏర్పాటు అయ్యాయని అమర్నాథ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చర్ హబ్ గా తయారు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు అప్పట్లోనే సిద్ధం చేశారని ఆయన చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎం ఓ యు లు కుదుర్చుకుందని అవన్నీ ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయని, ఈ ప్రతిభ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది అమర్నాథ్ అన్నారు.
2014-19 సంవత్సరాల మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చిన్న తరహా పరిశ్రమలకు ఇన్సెంటివ్లు ఇవ్వలేక చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మంజూరు చేశారని అమర్నాథ్ తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ ను సైతం ఎదుర్కొని పరిశ్రమలను ఆదుకున్నారని, ఇవన్నీ పక్కనపెట్టి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తామే అభివృద్ధి చేశామంటూ చంద్రబాబు జబ్బలు చరుచుకోవడం విడ్డూరంగా ఉందని అమర్నాథ్ అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన దృష్టి పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అమర్ రాజా బ్యాటరీస్ రాష్ట్ర నుంచి తరలిపోవడం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమర్నాథ్ సమాధానం చెబుతూ కంపెనీ విస్తరణ కోసం మాత్రమే వారు బయటకు వెళ్లారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాల చేయూతను అందించామని అమర్నాథ్ బదులిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా చేసిన తప్పుడు ప్రచారాలు విశాఖ నగరాభివృద్ధిని ఎంతగానో దెబ్బతీసేయని అమర్నాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విశాఖ సమగ్ర అభివృద్ధికి మీడియా పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కోటఉరట్ల ఘటనపై అమర్నాథ్ దిగ్బ్రాంతి
పారికరావుపేట నియోజకవర్గంలోని కైలాసపట్నం అనాధ శరణాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగి నలుగురు చిన్నారులు చనిపోయిన ఘటనపై మాజీ మంత్రి అమర్నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. అనవసర విషయాలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టకుండా, ఇటువంటి సున్నితమైన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.